సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను చింతలపాలెం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. దొంగ నుంచి రూ. 13.5 లక్షల విలువ చేసే 23.3 తులాల బంగారం ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సూర్యాపేట ఎస్సీ ఎస్ రాజేంద్ర ప్రసాద్ కథనం ప్రకారం.. జిల్లా పరిధిలోని దొండపాడు వద్ద శుక్రవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే చింతలపాలెం పరిధిలోని ఎర్రకుంట తండాకు చెందిన వాంకుడోతు నాగరాజు(26) వద్ద 23.3 తులాల బంగారాన్ని పోలీసులు గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని విచారించగా, బంగారు ఆభరణాలను దొంగతనం చేశానని, వాటిని విక్రయించేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటకు వెళ్తున్నట్లు పోలీసులకు నాగరాజు తెలిపాడు.
చింతలపాలెం, దొండపాడు, దొంగతనాలకు పాల్పడుతున్నాడు. చింతలపాలెం, దొండపాడు, తుమ్మారం, ఎర్రకుంట తండా, నక్కగూడెంలో జనవరి 2 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు నాగరాజు దొంగతనాలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని, నాగరాజు చోరీలు చేస్తున్నట్లు వెల్లడైంది. దొంగతనం కేసులో నాగరాజు ఇటీవలే జైలుకు వెళ్లి వచ్చాడని ఎస్సీ తెలిపారు.