అమరావతి: ప్రేమించిపెళ్లి చేసుకున్న సోదరిపై ఆమె సోదరుడు దాడి చేశాడు. పోలీస్ స్టేషన్ వద్ద అతను తన సోదరిపై కత్తితో దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..సంగం మండలం జెండాదిబ్బ ప్రాంతానికి చెందిన శిరీష, కోవూరు మండల పరిధిలోని చెర్లోపల్లికి చెందిన అశోక్ ప్రేమించుకున్నారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వీరు మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. దీంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారం కోవూరు పోలీస్ స్టేషన్కు చేరింది.
ఎస్ఐ దాసరి వెంకటేశ్వరరావు సోమవారం ఇరు కుటుంబాలను పోలీస్స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. రాత్రి కావడంతో మంగళవారం ఉదయం రమ్మని చెప్పాడు. ఆ సమయంలో స్టేషన్ బయట ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు శిరీష అంగీకరించలేదు. దీంతో శిరీష సోదరుడు హరీష్ తన సోదరిపై కత్తితో దాడి చేశాడు. పోలీసులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు పోలీసులు హరీష్ను అదుపులోకి తీసుకున్నారు.