అహ్మదాబాద్ : పెండ్లి చేసుకుంటానని చెప్పిన బాయ్ఫ్రెండ్ అందుకు నిరాకరించడంతో బాలిక (17) కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుజరాత్లోని వదోదరలో వెలుగుచూసింది. బాలికను అపహరించి ఆమెను తీవ్ర నిర్ణయం తీసుకునేందుకు ప్రేరేపించాడనే ఆరోపణలపై ఆమె బాయ్ఫ్రెండ్(24)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 7న నీళ్లు తీసుకువస్తానని చెప్పి బయటకు వెళ్లిన బాలిక తిరిగిరాలేదు.
మరుసటి రోజు సమీప కాలువలో శవమై తేలింది. పోలీసుల దర్యాప్తులో బాలిక స్నేహితుడు ప్రీతేష్ పర్మార్తో కలిసి వెళ్లిన బాలిక ఆపై విగతజీవిగా మారిందని వెల్లడైంది. ఇంటి నుంచి పారిపోయి పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న బాధితురాలు, ఆమె బాయ్ఫ్రెండ్ అక్టోబర్ 7న బయటకు వచ్చారు. ఆపై పరిస్ధితులు అనుకూలించలేదని చెబుతూ పెండ్లి ప్రతిపాదనను విరమించుకున్న బాయ్ఫ్రెండ్ ఆమెను తిరిగి ఇంటివద్ద దించి వెళ్లిపోయాడు. బాయ్ఫ్రెండ్ మోసగించాడని కలత చెందిన బాలిక మనోవ్యధకు లోనై తీవ్ర నిర్ణయం తీసుకుంది.