ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలంలోని కొడిశలకు చెందిన చేల చిన్ను (3) అనే బాలుడు మిషన్ భగీరథ వాల్వ్ కోసం ఏర్పాటుచేసిన సంపులో పడి మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన చేల సారయ్య చిన్న కుమారుడు చిన్ను తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నం కాగా చిన్ను ఇంటి ముందు ఆడుకుంటూ ఎదురుగా ఉన్న మిషన్ భగీరథ సంపులో ప్రమాదవశాత్తు పడిపోయాడని తెలిపారు.
చాలా సేపు అయిన చిన్ను కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతగ్గా ఇంటి ఎదురుగా ఉన్న సంపులో కనిపించాడని బయటకు తీసేసరికి మృతి చెందాడన్నారు. అంత సేపు తమ కండ్లముందు ఆడుకుంటున్న కొడుకు సంపులో పడి శవమై కనిపించడంతో తల్లిదండ్రులు చేసిన రోదనలు మిన్నంటాయి. గుండెలవిసేలా రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.