భోపాల్ : ఓ 12 ఏండ్ల బాలుడు స్కూల్ బస్సులో వెళ్తూ గుండెపోటుకు గురయ్యాడు. తోటి విద్యార్థులు చూస్తుండగానే కుప్పకూలిపోయాడు. బస్సు డ్రైవర్ హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. భింద్ సిటీకి చెందిన మనీష్ జాతవ్(12) ఎతవాహ రోడ్డులోని ఓ ప్రయివేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. అయితే గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్కూల్ నుంచి ఇంటికి స్కూల్ బస్సులో తిరిగి వస్తుండగా జాతవ్ కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్.. స్కూల్ సిబ్బందికి సమాచారం అందించాడు. దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి బస్సును తీసుకెళ్లాడు. ఇక జాతవ్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడు గుండెపోటుకు గురైనట్లు డాక్టర్లు ధృవీకరించారు. జాతవ్కు పోస్టుమార్టం చేయొద్దని అతని తల్లిదండ్రులు వైద్యులకు విజ్ఞప్తి చేశారు.