Gold Smugling Foiled | విదేశాల నుంచి వచ్చిన విమాన ప్రయాణికులు బంగారం స్మగ్లింగ్కు చేసిన ప్రయత్నాలను చెన్నై కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు శనివారం కస్టమ్స్ అధికారులు తెలిపారు. రెండు కిలోలకు పైగా గల బంగారం విలువ రూ.1.14 కోట్లు ఉంటుందన్నారు.
శుక్రవారం దుబాయి నుంచి వచ్చిన విమాన ప్రయాణికుడు తన లోదుస్తుల్లో బంగారం దాచి పెట్టాడు. వ్యక్తిగతంగా కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయడంతో బంగారం బయటపడిందని చెన్నై ఎయిర్పోర్ట్స్ కస్టమ్స్ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు.
రెండో ఘటన శనివారం చోటు చేసుకున్నది. షార్జా నుంచి వచ్చిన విమాన ప్రయాణికుడు బంగారం పేస్ట్ ప్యాకెట్లను లోదుస్తుల్లో దాచిపెట్టి బయటపడకుండా టేప్ వేశాడు. కస్టమ్స్ సిబ్బంది తనిఖీ చేయడంతో బంగారం పేస్ట్ బయటపడింది.
రెండు ఘటనల్లో 2.36 కిలోల బంగారం దొరికిందని దీని విలువ రూ.1.14 కోట్లు ఉంటుందని చెన్నై ఎయిర్పోర్ట్స్ కస్టమ్స్ కమిషనర్ తెలిపారు. కస్టమ్స్ చట్టం-1962లోని వివిధ సెక్షన్ల కింద ఇద్దరు ప్రయాణికులపై కేసు నమోదు చేశామన్నారు. వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని తెలిపారు.