కాటారం : కాటారం మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయ సమీపంలో బుధవారం విద్యుత్ బల్బు బిగించడానికి సురేష్ అనే యువకుడు స్తంభం పైకి ఎక్కగా విద్యుత్ షాక్కు గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. గ్రామ పంచాయతీ పరిధిలో స్తంభాలకు బల్బులు అమర్చడానికి విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించి ఎల్సీ తీసుకున్నారు. బల్బులు పెట్టడానికి పనులు చేపట్టిన నిర్వాహకులు యువకులతో బల్బులు పెట్టిస్తున్నారు. ఇదే క్రమంలో సురేశ్ అనే యువకుడు బల్బును అమర్చడానికి విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుత్ తీగెను తాకడంతో షాక్ వచ్చి తీగల మధ్య ఇరుక్కపోయాడు.
అదృష్టవశాత్తు సబ్స్టేషన్లో విద్యుత్ ట్రిప్ కావడంతో తీవ్ర గాయాలతో సురేశ్ స్తంభంపైనే ఉండగా తోటి వారు అతన్ని కిందకు దించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోచమ్మ ఆలయ సమీపంలోని విద్యుత్ స్తంభాల ఫీడర్ చింతకాని పరిధిలోకి వస్తుండగా, అందుకు సంబంధించి విద్యుత్ సరఫరాను నిలిపివేసేలా ఎల్సీ తీసుకోలేదు. బల్బులు పెట్టేవారికి అన్ని స్తంభాలు కాటారం పరిధిలోనే ఉన్నాయని స్తంభం ఎక్కడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎల్సీ ఇచ్చిన లైన్మెన్ బాధ్యతగా చూసుకోవాల్సి ఉండగా ఇటీవలే విధుల్లోకి రావడంతో నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.