బెంగళూర్ : టీవీ రిమోట్ విషయంలో వాదులాటలో తండ్రికి అనుకూలంగా మాట్లాడిందనే ఆగ్రహంతో మూడేండ్ల చిన్నారిని సొంత తల్లే దారుణంగా చంపిన ఘటన బెంగళూర్లో వెలుగుచూసింది. నగరంలోని బీడీఏ లేఅవుట్లో నిర్మాణంలో ఉన్న ఇంటిలో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లతహళ్లిలో నివసించే సుధ(26) నగరంలోని టైల్స్ షాపులో హౌస్కీపింగ్ విభాగంలో పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం సుధ భర్త ఈరన్న మధ్నాహ్న భోజన సమయంలో ఇంటికి రాగా కూతురు వినుత టీవీ చూస్తోంది.
బాలిక నుంచి రిమోట్ తీసుకున్న ఈరన్న న్యూస్ చూసేందుకు ఛానెల్ మార్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సుధ నిత్యం వార్తలు మాత్రమే చూడాలనుకుంటే ఇంటికి రావద్దని భర్తతో గొడవపడింది. ఈ సమయంలో తండ్రితో ఘర్షణ పడవద్దని, ఆయనకు ఇష్టమైన ఛానెల్ చూడనివ్వమని బాలిక అనడంతో ఆగ్రహించిన తల్లి కుమార్తెను దారుణంగా హత్యచేసింది. అదేరోజు రాత్రి స్ధానిక పోలీస్ స్టేషన్లో బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. బుధవారం అటుగా వెళుతున్న వ్యక్తికి బాలిక మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఈరన్న, సుధలను స్టేషన్కు పిలిపించిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కుమార్తెను తానే చంపానని సుధ వెల్లడించింది. తండ్రిని వెనకేసుకురావడంతో పట్టరాని ఆగ్రహంతో తానే చిన్నారిని చంపానని తెలిపింది.