బెంగళూర్ : తాను గతంలో పనిచేసిన బెంగళూర్లోని టెక్నాలజీ కంపెనీలోకి చొరబడి సంస్ధ ఎండీ, సీఈవోలను మంగళవారం హత్య (Bengaluru double murder) చేసిన నిందితుడు శబరీష్ అలియాస్ ఫెలిక్స్ హత్యకు ముందు వాట్సాప్లో నిగూఢ అర్ధాన్ని ఇచ్చే మెసేజ్ను పోస్ట్ చేశాడు. ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీలో గతంలో పనిచేసిన ఫెలిక్స్ ఆ కంపెనీ ఎండీ ఫణీంద్ర సుబ్రహ్మణ్యం, సీఈవో వినుకుమార్లపై పగ పెంచుకున్నాడు.
పధకం ప్రకారం ఫెలిక్స్ మంగళవారం సాయంత్రం కంపెనీలోకి చొరబడి కత్తితో వారిద్దరినీ దారుణంగా హత్య చేశాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా వారు మరణించారు. ఫెలిక్స్ అనుసరించే వ్యాపార పద్ధతులను వీరు వ్యతిరేకించడంతోనే కక్ష పెంచుకుని దారుణానికి ఒడిగట్టాడని చెబుతున్నారు. ఏరోనిక్స్ సంస్ధ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫెలిక్స్ అదే తరహా వ్యాపారం చేస్తున్నాడు.
ఇక ఫణీంద్ర, విను కుమార్లను ఉద్దేశించే తాను చెడ్డవారినే శిక్షిస్తానని వాట్సప్ మెసేజ్ పోస్ట్ చేసి ఉంటాడని భావిస్తున్నారు. భూమిపై మోసగాళ్లు తిరుగాడుతున్నారు..అందుకే వీరిని శిక్షిస్తా..నేను చెడ్డవారినే శిక్షిస్తా..మంచివారికి నేను ఎన్నడూ హాని తలపెట్టనని హత్యకు ముందు వాట్సాప్ పోస్ట్లో ఫెలిక్స్ రాసుకొచ్చాడు. జంట హత్యల కేసులో ఫెలిక్స్తో పాటు అతడి అనుచరులు వినయ్ రెడ్డి, సంతోష్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read More :