బెంగళూరు, జనవరి 10: లోన్ ఇవ్వలేదని కర్ణాటకలో ఓ వ్యక్తి ఏకంగా బ్యాంకుకే నిప్పు పెట్టాడు. హవేరీ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. రత్తిహళ్లి పట్టణంలో ఉండే వసీం హజారస్తాబ్ ముల్లా(33) హెదుగొండ గ్రామంలో ఉన్న కెనరా బ్యాంకులో లోను కోసం దరఖాస్తు పెట్టుకొన్నాడు.
అతని సిబిల్ స్కోరు తక్కువగా ఉందని బ్యాంకు ఆ దరఖాస్తును తిరస్కరించింది. దీంతో ఆగ్రహం చెందిన వసీం శనివారం రాత్రి బ్యాంకు కిటికీలు పగులగొట్టి లోపల పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఐదు కంప్యూటర్లు, డాక్యుమెంట్లు మంటల్లో కాలిపోయాయని, రూ.12 లక్షల నష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. నిందితుడు వసీంను అరెస్టు చేశారు.