పెనుబల్లి: పెనుబల్లి వైద్యశాలలో శిశువు మృతి చెందడంతో బంధువులు ఆగ్రహించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పెద్దవేగి మండలం నన్నక దొండపాడు గ్రామానికి చెందిన పర్సారేష్మా డెలివరీ చేయించుకునేందుకు రాగా పెనుబల్లి వైద్యశాలలో గత మూడు రోజుల క్రితం చేర్పించారు. శుక్రవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో సాధారణ ప్రసవం చేసేందుకు సిస్టర్లు డ్యూటీలో ఉన్న డాక్టర్ సహాయంతో ప్రసవం చేశారు.
డెలివరీ అయిన అనంతరం ఆడశిశువు మృతి చెందింది.దీంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆసుపత్రిపై దాడి చేసి అద్దాలు పగులగొట్టి ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న వీయం బంజరు ఎస్ఐ శ్వేత వైద్యశాలకు చేరుకుని శిశువు బంధువులను సముదాయించారు. ఈ సంఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఆసుపత్రి సిబ్బంది, సామాగ్రి ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.