కరోనా రోగులు వ్యాధినుంచి కోలుకొన్న తర్వాత కూడా చాలా నీరసంగా కనిపిస్తున్నారు. బలహీనంగా, అలసిపోయినట్టు శరీరం తయారవుతున్నది. కొవిడ్ చికిత్స ద్వారా కోలుకున్నవారిలో కండరాలు, కీళ్ల నొప్పులు రోజుల తరబడి ఇబ్బంది పెడుతున్నాయని, ఇటువంటి సమస్యలనుంచి బయట పడాలంటే కరోనా సమయంలో, కోలుకున్న తర్వాత వ్యాయామం తప్పనిసరి అంటున్నారు యశోద దవాఖాన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నితిన్కుమార్. ఆర్థోపెడిక్ సమస్యలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో డాక్టర్ నితిన్ పలు అంశాలు వెల్లడించారు.
కరోనా సోకినప్పుడు ఒంటి నొప్పులు ఉంటాయా?
కరోనా సోకినప్పుడు ఎముకలు లేదా కీళ్లను ప్రభావితం చేయదు. కానీ చాలామంది బాధితుల్లో కండరాల నొప్పులున్నట్టు చెప్తారు. ఈ కండరాల నొప్పులు కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొన్ని వారాలపాటు ఉంటాయి. కొన్నిసార్లు నొప్పులు కొన్ని నెలలు కూడా ఉంటున్నట్టు పలువురి ద్వారా తెలుస్తున్నది. ఈ నొప్పులకు సరైన పరిష్కారం పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవడం.
వైరస్నుంచి కోలుకున్నాక సాధారణ స్థితికి ఎలా చేరుకోవాలి?
కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలామంది అలసిపోయినట్టు, బలహీనంగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నామని చెప్తుంటారు. వారిలో సాధారణ పనితీరు తిరిగి రావడానికి చాలాసమయం పడుతుంది. శారీరక బలం పెరిగేందుకు క్రమంగా వాకింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఊపిరితిత్తుల పనితీరు సైతం సాధారణ స్థితికి రావాలంటే నిపుణుల సలహా తీసుకొని తగిన విధంగా శ్వాస సంబంధిత వ్యాయామాలు కూడా చేయాలి. మళ్లీ సాధారణ పనితీరుకు తిరిగి రావడానికి ప్రతిరోజూ వెన్నెముక, మోకాళ్లు, మెడ భాగాలు బలంగా ఉండేందుకు తగిన వ్యాయామాలు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
కరోనా సమయంలో శస్త్రచికిత్సలు సురక్షితమేనా?
ప్రస్తుత పరిస్థితుల్లో దవాఖానలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అత్యవసర శస్త్రచికిత్స అయితేనే చేయించుకోవాలి. లేదంటే కరోనా పరిస్థితులు మెరుగుపడే వరకు వైద్యుడి సలహా మేరకు వేచి ఉండాల్సిందే. ఎముకల పగుళ్లు, ఇతర తీవ్ర సమస్యలుంటే మాత్రం అత్యవసర శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. అటువంటి వారికి కొవిడ్ నిబంధనలను పూర్తిగా పాటిస్తూ.. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య శస్త్రచికిత్సలు నిర్వహించాలి.
టీకాతోపాటు పెయిన్ కిల్లర్స్ వేసుకోవచ్చా?
అనారోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల పెయిన్ కిల్లర్స్ వాడుతున్నవారు వైద్యుడి సలహా తీసుకొని టీకా వేయించుకోవాలి. ఆ మందులను తప్పనిసరిగా వాడాల్సి ఉంటే కొనసాగించండి. లేదంటే మందుల వాడకం నిలిపే అవకాశం ఉంటే మాత్రం నాలుగు రోజులు వేసుకోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల శరీరంలో యాంటీబాడీ ప్రతిస్పందనను తగ్గిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి. దీని దృష్ట్యా టీకా వేసుకోవడానికి రెండు రోజుల ముందు, రెండు రోజుల తర్వాత పెయిన్ కిల్లర్స్ వేసుకోవడాన్ని ఆపడమే మంచిది.
తరచూ మెడ నొప్పి, వెన్ను నొప్పిని అధిగమించడం ఎలా?
కరోనా బారిన పడకపోయినా ఇంట్లో ఎక్కువ గంటలు విరుద్ధ భంగిమలో కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పి కలగడం చాలా సాధారణం. పని ప్రదేశంలో ఎక్కువ సమయం కూర్చోవాల్సి వస్తే.. వెనుక భాగానికి అనువుగా ఉండేలా సరైన కుర్చీని ఉపయోగించడం చాలా ముఖ్యం. వెనుకకు సూటిగా కూర్చొవడం, ఎక్కువ సేపు మెడను వంచకుండా ఉండటం వంటివి చేయాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తూనే పని మధ్యలో కొంత విరామం తీసుకోవడం ద్వారా ఈ నొప్పుల బారిన పడకుండా ఉంటారు.
వైరస్ నుంచి కోలుకున్నా కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటే ఎలా అధిగమించాలి?
కీళ్ల నొప్పులు రెండు కారణాల వల్ల పెరుగుతాయి. మొదట కండరాల నొప్పుల వల్ల కీళ్లలో కూడా నొప్పులు వస్తాయి. రెండోది వ్యాయామం లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కరోనా కాలంలో కీళ్ల నొప్పులను నివారించేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. కొవిడ్ ఇన్ఫెక్షన్ సమయంలో ఇచ్చే స్టెరాయిడ్లు ఎముకలను బలహీనపరుస్తాయి. స్టెరాయిడ్ వాడకం కొన్నిసార్లు హిప్ ఎముకల లోపల రక్తం గడ్డ కట్టడం వంటివి ఎముకకు హాని కలిగిస్తుంది. అందువల్ల స్టెరాయిడ్లు అవసరమైనపుడు మాత్రమే వాడాలి.
ఎముకల్లో బలం పెంచుకొనేందుకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
క్యాల్షియం అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, నట్స్ వంటివి తీసుకుంటే ఎముకల్లో బలం పెరుగుతుంది. ఎముక ఆరోగ్యానికి విటమిన్ డీ చాలా ముఖ్యం. తగినంత సూర్యరశ్మిని పొందలేకపోతే, తప్పనిసరిగా విటమిన్ డీ సప్లిమెంట్ ట్యాబ్లెట్లను తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధకశక్తిని మెరగుపర్చుకోవడంలోనూ విటమిన్ డీ ప్రధానపాత్ర పోషిస్తున్నది.