Zomato | ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ‘జొమాటో (Zomato)’ ఫుడ్ డెలివరీ ఫీజు 25 శాతం పెంచింది. ప్రతి ఫుడ్ ఆర్డర్ మీద రూ.5 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ఫీజు ఈ నెల 20 నుంచే అమల్లోకి వచ్చింది. ఢిల్లీ-దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), బెంగళూరు, ముంబై, హైదరాబాద్, లక్నో వంటి నగరాల్లో కస్టమర్ల నుంచి పెంచిన ఫీజు వసూలు చేస్తున్నది. మరో ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ ‘స్విగ్గీ (Swiggy)’ సైతం ఒక్కో ఆర్డర్ డెలివరీకి రూ.5 చొప్పున పెంచి వసూలు చేస్తున్నది. ఇంతకుముందు డిసెంబర్ 31న ఒక్కో ఆర్డర్ మీద ప్లాట్ ఫామ్ ఫీజు తాత్కాలికంగా రూ.9లకు పెంచి వసూలు చేసింది.
గతేడాది ఆగస్టులో మొదటిసారి జొమాటో తన ప్లాట్ ఫామ్ ఫీజు అమల్లోకి తెచ్చింది. ప్రారంభంలో ప్రతి ఆర్డర్ మీద రూ.2 చొప్పున వసూలు చేసిన జొమాటో.. గత అక్టోబర్ నెలలో రూ.3, జనవరిలో రూ.4లకు పెంచేసింది. ఇప్పుడు తాజాగా ప్లాట్ ఫామ్ ఫీజు రూ.5 చేసింది. ఫుడ్ డెలివరీ యాప్స్ సాధారణంగా ఫుడ్, డెలివరీ చార్జీ వసూలు చేస్తాయి. ఇప్పుడు ఆ యాప్స్ తమ ఆదాయం పెంచుకోవడానికి కొత్తగా ప్లాట్ ఫామ్ ఫీజు తీసుకొచ్చాయి. జొమాటో అనుబంధ క్విక్ కామర్స్ బ్లింకిట్ ప్లాట్ ఫామ్ ఫీజు పేరుతో రూ.2 వసూలు చేస్తున్నది.
ప్రతియేటా జొమాటోకు 85-90 కోట్ల ఆర్డర్లు వస్తాయి. పెంచే ప్రతి రూపాయి ప్లాట్ ఫామ్ ఫీజు వల్ల సంస్థకు సానుకూల ఫలితాలు వస్తాయి. అయితే, ఈ ఫీజు కొన్ని నగరాల్లో మాత్రమే అమలు చేస్తున్నారు. ఇక ‘ఇంటర్ సిటీ లెజెండ్’ సర్వీసులకు జొమాటో స్వస్తి పలికింది. ఒక నగరంలోని ప్రధాన రెస్టారెంట్ల నుంచి ఇతర నగరాల వాసులకు డెలివరీ చేసే పథకాన్నే ‘ఇంటర్ సిటీ లెజెండ్స్’ అని పేర్కొన్నారు.