Madhya Pradesh | భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని సిటీలో ఓ 12 ఏండ్ల బాలికపై లైంగికదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ ఆటో డ్రైవర్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్ను రాకేశ్(38)గా పోలీసులు గుర్తించారు. అయితే ఆటోలో రక్తపు మరకలు ఉండటంతో అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
బాధిత బాలిక అర్ధనగ్నంగా, తీవ్రమైన రక్తస్రావంతో సాయం కోసం ఉజ్జయిని పట్టణ వీధుల్లో ఇంటింటికీ తిరిగినా, స్థానికులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీధుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డు అయ్యాయి. 8 కిలోమీటర్ల మేర బాలిక వీధుల్లో తిరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆటో డ్రైవర్ను అరెస్టు చేశారు. సోమవారం బాలికపై లైంగిక దాడి జరిగినట్టు తెలుస్తున్నది.
లైంగిక దాడి అనంతరం అర్ధనగ్నంగా, ప్రైవేటు భాగాల నుంచి తీవ్ర రక్తస్రావంతో బాధిత బాలిక దాదాపు 2 గంటల పాటు ఇంటింటికీ వెళ్లి సాయం చేయాలని అర్థించింది. అయితే స్థానికులు స్పందించలేదు. చివరకు ఓ ఆశ్రమం వద్దకు బాలిక చేరుకోగా, ఆమె లైంగిక దాడికి గురైనట్టు ఓ సాధువు గుర్తించి, జిల్లా దవాఖానకు తరలించారు. బాలిక లైంగిక దాడికి గురైనట్టు వైద్యులు ధ్రువీకరించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో ఇండోర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు. సోమవారం ఉజ్జయినిలోని మహాకల్ పోలీసుస్టేషన్ ఏరియాలో బాలిక రక్తపు మడుగులో కనిపించిందని ఉజ్జయిని ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు. బాధిత బాలిక యూపీకి చెందిన ప్రయాగ్రాజ్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.