గువహటి : తొమ్మిదేండ్ల కిందట అరుణాచల్ ప్రదేశ్లో విక్రయించిన బాలిక(12)ను అసోంకు చెందిన విశ్వనాధ్ జిల్లా పోలీసులు కాపాడి తల్లి సీమా ఖరియా చెంతకు చేర్చారు. బాలికను మూడేండ్ల వయసులో ఓ మహిళ అరుణాచల్ ప్రదేశ్కు చెందిన కుటుంబానికి రూ లక్షకు విక్రయించింది. విశ్వనాధ్ జిల్లా గోలియ నబాపూర్ ప్రాంతానికి చెందిన బాలిక తండ్రి ఆమెను సాకలేక స్ధానికంగా ఉండే రోమిలా అనే మహిళకు బాలికను అప్పగించాడు. రోమిలా ఆ బాలికను రూ లక్షకు విక్రయించింది.
బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన విశ్వనాధ్ జిల్లా పోలీసులు రోమిలాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బాలికను అరుణాచల్ ప్రదేశ్లోని ఓ కుటుంబానికి రూ లక్షకు విక్రయించానని అంగీకరించింది. అసోం పోలీసులు సత్వరమే అరుణాచల్ ప్రదేశ్ పోలీసులను సంప్రదించగా వారు నహర్లాగాం ప్రాంతం నుంచి బాలికను కాపాడారు. తొమ్మిదేండ్ల తర్వాత బాలికను తల్లితో కలిపారు. తొలుత తల్లిని గుర్తుపట్టని బాలిక ఆ తర్వాత ఆమెను గుర్తించింది.