ముంబై : తన వద్ద అప్పుగా తీసుకున్న రూ 17.000 తిరిగి ఇవ్వాలని కోరినందుకు స్నేహితుడిని దారుణంగా చంపి అతడి శరీర భాగాలను కోసి కాలువలో పడేసిన కసాయి ఉదంతం నవీముంబైలో వెలుగుచూసింది. నిందితుడిని సుజీత్ కుమార్ చౌహాన్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నవీముంబైలోని కొపర్ఖైరానేకి చెందిన చౌహాన్ తన స్నేహితుడు రవీంద్ర మందోటియా వద్ద రూ 17.000 అప్పుగా తీసుకున్నాడు.
బాకీ తిరిగి చెల్లించే విషయమై ఇద్దరికీ పలుమార్లు గొడవలు జరిగాయి. గతవారం మద్యం సేవించేందుకు స్నేహితుడు మందోటియాను చౌహాన్ పిలిచాడు. మందోటియా మద్యం సేవించిన అనంతరం మత్తులో ఉండగా చౌహాన్ పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఆపై స్నేహితుడి శరీరాన్ని మూడు ముక్కలుగా కోసి వాటిని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఏపీఎంసీ ప్రాంతంలో దుర్వాసన రావడంతో స్ధానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్లాస్టిక్ బ్యాగ్లో దొరికిన హతుడి చేయిపై హనుమాన్ ఫోటోతో పాటు రవీంద్ర అని రాసి ఉండటంతో పోలీసుల దర్యాప్తులో బాధితుడిని రవీంద్ర మందోటియాగా గుర్తించారు. ఆపై అతడితో విభేదాలున్నట్టు తెలుసుకున్న పోలీసులు చౌహాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతడు నేరాన్ని అంగీకరించాడు.