అమరావతి: సైబర్ నేరాలపై నిఘా పెంచేందుకు, సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెల్లు, సోషల్ మీడియా ల్యాబ్లను ప్రారంభించేందుకు ఏపీ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని,వాటిపై నిఘాను పటిష్టం చేయాలని, సైబర్ సెల్లు, సోషల్ మీడియా ల్యాబ్లను ప్రారంభించాలని ఏపీ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది.
అధునాతన సాంకేతికత,సాఫ్ట్వేర్,కంప్యూటర్లు,శిక్షణ పొందిన వారిని నియమించనున్నారు. ప్రతి సోషల్ మీడియా ల్యాబ్లో సైబర్ క్రైమ్లను పరిష్కరించడానికి బీటెక్ అర్హతతో ఒక సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తోపాటు ఐదుగురు కానిస్టేబుళ్లను నియమిస్తారు. అందుకోసం రాష్ట్రంలోని 20,000 మంది పోలీసు సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
ఒంగోలు, విజయనగరం, అనంతపురం జిల్లాల్లోని పోలీసు శిక్షణా కేంద్రంలో తొలుత 300 మంది పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) డి గౌతమ్ సవాంగ్ తెలిపారు. సోషల్ మీడియా నేరాలు,సైబర్ నేరాలు,సైబర్ నేరాల నియంత్రణపై నిపుణులు పోలీసులకు శిక్షణ ఇస్తారు.
ఓటీపీలు,ఆధార్-లింక్ పేరుతో జరిగే మోసాలు, బీమా సంబంధిత మోసాలు,బిట్కాయిన్ మోసాలు,సోషల్ మీడియాలో మహిళలు,పిల్లలపై వేధింపులకు సంబంధించి అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు. సైబర్ నేరాలు వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నాయన్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ సైబర్ నేరాలకు గురవుతున్నారని గుర్తు చేశారు. అటువంటి నేరాలపై ఉక్కుపాదం మోపనునట్లు ఆయన వెల్లడించారు.