శేరిలింగంపల్లి : పాల ప్యాకేట్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్దుడు ద్విచక్రవాహనం ఢీకొని మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కొండాపూర్ గోల్డెన్ తులీప్ కాలనీలో తుమ్మల కోటేశ్వరరావు (70) ఓలెక్స్ సంస్థలో ఐటీ డిపార్టుమెంట్లో పనిచేసే తన కొడుకు ఫణికుమార్తో కలిసి నివసిస్తున్నాడు.
ఫణికుమార్ దీపావళీ పండుగను పురస్కరించుకొని మంగళవారం ఆత్తగారింటికి వెళ్లాడు. కాగా పాలప్యాకేట్ కోసం గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో తుమ్మల కోటేశ్వరరావు ఇంటి సమీపంలోని రాఘవేంద్రకాలనీ హైటెన్షన్ రోడ్లోని దుకాణానికి వెళ్తుండగా గుర్తుతెలియన ద్విచక్రవాహనం ఢీకొట్టింది.
దీంతో తలకు తీవ్రగాయాలకు గురైన తుమ్మల కోటేశ్వరరావును చికిత్స కోసం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్సటల్కు తరలించారు. రాత్రి 10.30 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.