హుస్నాబాద్, సెప్టెంబర్ 30 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బైపాస్ రోడ్డు, ఆరెపల్లి క్రాసింగ్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొట్లపల్లి గ్రామానికి చెందిన బండి అఖిల్(18)అనే ఇంటర్మీడియట్ విద్యార్థి మృతి చెందాడు.
మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హుస్నాబాద్లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితుడు మౌటం సిద్దుతో కలిసి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై హుస్నాబాద్ కళాశాలకు వస్తున్నారు.
ఆరెపల్లి నుంచి బైపాస్కు చేరుకుంటున్న సమయంలో అతివేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ వీరి వాహనాన్ని ఢీకొట్టడంతో అఖిల అక్కడికక్కడే మృతిచెందగా.. సిద్దు స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. అదేసమయంలో అటుగా వస్తున్న చిగురుమామిడి మండలం కొండాపూర్కు చెందిన ఇద్దరు యువకుల వాహనాన్ని కూడా ట్రాక్టర్ ఢీకొట్టడంతో వారు తీవ్ర గాయాలపాలయ్యారు.
మృతుని తండ్రి బండి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. కాలేజీకి వెళ్లి వస్తాడనుకున్న కొడుకు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.