కోల్కతా : సరైన ఉద్యోగం లేదని దీర్ఘకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఎయిర్ హోస్టెస్ (27) భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం కోల్కతాలో వెలుగుచూసింది. మృతురాలిని ప్రగతి మైదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రపాలిటన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన దేవప్రియ బిశ్వాస్గా గుర్తించారు.
పూర్తిస్ధాయి ఉద్యోగం లేదని ఆమె దీర్ఘకాలంగా డిప్రెషన్తో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె తమ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. భవనం ముందుభాగంలో కిందపడిన ఆమెకు తీవ్రగాయాలు కావడంతో ఎస్ఎస్కేఎం మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. సరైన ఉద్యోగం లేకపోవడంతో ఆమె కుంగుబాటుకు గురై మానసిక అస్వస్ధతకు లోనైందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.