చెన్నై : ఆన్లైన్ రమ్మీ గేమ్లో రూ 20 లక్షలు పోగొట్టుకోవడంతో ఓ వ్యక్తి బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని ఈస్ట్ తాంబరం, భారతీదాసన్ స్ట్రీట్కు చెందిన క్యాబ్ డ్రైవర్ ఎస్ మురుగన్ (31)గా గుర్తించారు. మురుగన్కు భార్య ప్రియ, ఏడాది వయసున్న కొడుకు ఉన్నాడు.
ఆన్లైన్ గేమ్స్కు బానిసైన మురుగన్ రోజంతా ఫోన్లో మునిగిపోయి స్నేహితుల దగ్గర అప్పులు చేసి మరీ గేమ్స్ ఆడేవాడు. ఆన్లైన్ గేమ్స్లో పెట్టుబడి పెట్టి మొత్తం సొమ్ము పోగొట్టుకోవడంతో తీవ్ర మనస్ధాపానికి లోనయ్యాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సెలియూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.