బెంగళూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన భర్త, అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. లేత్ మిషన్ ఆపరేటర్గా పనిచేసే 32 ఏండ్ల మంజునాథ్, భార్య 28 ఏండ్ల రోజా ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరు తీగలరాపాల్య ప్రాంతంలోని అద్దె ఇంట్లోకి మారారు. మంజునాథ్ మద్యం సేవించడంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవ జరిగేది. తరచుగా అతడు భార్యను కొట్టేవాడు.
ఆదివారం మధ్యాహ్నం మంజునాథ్, రోజా పొట్లాడుకోవడం, అరుచుకోవడాన్ని పొరుగువారు విన్నారు. అయితే సాయంత్రానికి వారి ఇంటి తలుపు లోపల నుంచి బోల్ట్ వేసి ఉన్నది. పొరుగువారు పిలిచినా తలుపు తెరువకపోవడంతో అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు భార్యాభర్తలిద్దరు మరణించి ఉండటాన్ని గమనించారు. భార్య మృతదేహం నేలపై ఉండగా భర్త మృతదేహం సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతున్నది. దీంతో భార్య రోజాను కొట్టి చంపిన అనంతరం భర్త మంజునాథ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.