లక్నో : జార్ఖండ్లోని ధంకాలో ప్రేమించడం లేదనే ఆగ్రహంతో బాలికకు ఓ బాలుడు నిప్పంటించడంతో ఆమె మరణించిన ఘటన మరువక ముందే యూపీలోని అలీఘఢ్లో మరో దారుణం వెలుగుచూసింది. నగరంలోని కిషన్పూర్ ప్రాంతంలో 18 ఏండ్ల బాలికపై పెట్రోల్ పోసి తగులబెట్టేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పదకొండో తరగతి చదివే బాలికను సదరు వ్యక్తి చెంపదెబ్బ కొట్టడంతో బాలిక కోపంతో అతడి ముఖంపై కారం చల్లి ఇంటికి తిరుగుముఖం పట్టింది. దీంతో తన స్నేహితులతో కలిసి వెంబడించిన నిందితుడు బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నిస్తుండగా బాలిక భయంతో సాయం కోసం అరుస్తూ పరుగుతీసింది. వీధిలో నడుచుకుంటూ వెళుతున్న స్ధానికులు రంగంలోకి దిగి ఆమెను కాపాడారు.
జనాలు గుమికూడటంతో నిందితుడు స్నేహితులతో కలిసి పరారయ్యాడు. బాలిక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం దీన్దయాళ్ ఆసుపత్రికి తరలించారు. బాలికను నిందితుడు తరచూ వేధిస్తున్నాడని ఘటనపై బాలిక తండ్రి తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేశామని అతడిపై తగిన చర్యలు చేపడతామని అలీఘఢ్ ఎస్పీ కుల్దీప్ సింగ్ గుణవత్ వెల్లడించారు.