మహబూబాబాద్: బాధ్యతారాహిత్యంగా అదే పనిగా టపాసులు కాల్చవద్దని, బాధ్యతగా వ్యవహరించి రాత్రి వేళల్లో ఎక్కువ సమయం బాంబులు కాల్చుతూ ప్రజలకు సౌండ్ పొల్యూషన్తో ఇబ్బందులు కలిగించొద్దని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఓ ప్రకటనలో సూచించారు. దీపావళి పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. పూర్వకాలంలో అయితే దీపంతోనో అగ్గిపుల్లతోనో అంటిస్తేనే బాంబులు పేలేవి. నేడు ఆ పరిస్థితి లేదు. ఒక్కసారి అంటించామంటే వందల టపాసులు పేలేలా సరికొత్త బాంబులు మార్కెట్ లోకి వచ్చేశాయి. బాంబులు పేల్చే వారికి పెద్ద శబ్ధాలతో సంబురం కలుగుతుంది. కానీ రాత్రి పొద్దు పోయాక నిద్రించే వారికి ఇబ్బందులు కలుగుకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. రాత్రి 9 గంటలు దాటాక అదే పనిగా బాంబులు పేల్చే వారిపై పోలీసులు నిఘా ఉంచారని, రాత్రి వేళల్లో ఎక్కువ సమయం బాంబులు కాల్చే వారిపై చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి ఎవరికీ ఆటంకం కలుగనివ్వకుండా దీపావళి పండుగను జరుపుకోవాలని ఎస్పీ ప్రజలకు సూచించారు.