బెంగళూరు: పెళ్లికి నిరాకరించిన ముగ్గురు పిల్లల తల్లిపై ఒక వ్యక్తి యాసిడ్ పోశాడు. దీంతో ఆమె కంటికి తీవ్ర గాయమైంది. ఆ మహిళను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల మహిళకు ముగ్గురు పిల్లలున్నారు. భర్త నుంచి విడాకులు పొందిన ఆమె, స్థానిక అగరబత్తి ఫ్యాక్టరీలో పని చేస్తున్నది. కాగా, అదే ఫ్యాక్టరీలో పని చేసే 36 ఏళ్ల అహ్మద్ అనే వ్యక్తితో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. మూడేళ్లగా వారిద్దరూ కలిసి అక్కడే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోమని కొన్ని వారాలుగా అహ్మద్ ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. అయితే ఆ మహిళ నిరాకరించింది.
దీంతో కక్ష పెంచుకున్న అతడు శుక్రవారం ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. ఆ మహిళ కుడి కంటికి గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అహ్మద్ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.