బంజారాహిల్స్ : హత్యాయత్నం కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులమీదకు కుక్కలను ఉసిగొల్పడం తో పాటు దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెం 12లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి సయ్యద్ అహ్మద్ జాఫ్రీ (71)తో జూబ్లీహిల్స్ రోడ్ నెం 86లో నివాసం ఉంటున్న అరిఫ్ మొహియుద్దీన్ (29) కు ఓ స్థలం విషయంలో వివాదం నడుస్తోంది.
ఈ నేపధ్యంలో అరిఫ్ 20మంది గుండాలతో మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత జాఫ్రీ ఇంట్లోకి ప్రవేశించి హత్యా యత్నం చేసిన ఘటనలో అరిఫ్ మొహియుద్దీన్పై కేసు నమోదయింది. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు బంజారాహిల్స్ పోలీసులు బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని అరిఫ్ మొహియుద్దీన్ ఇంటికి వెళ్లారు. అప్పటికే ఇంట్లో ఉన్న అరిఫ్ పోలీసులకు సహకరించకపోగా తలుపులు వేసుకున్నాడు.
బయటకు రావాలంటూ పోలీసులు కోరినా పట్టించుకోకపోగా వారిమీదకు కుక్కలను ఉసిగొల్పాడు. అంతటితో ఆగకుండా అరిఫ్ తల్లితో పాటు చెల్లెళ్లు బయటకు వచ్చి పోలీసులను దుర్భాషలాడారు. తమకు పెద్ద అధికారులు, రాజకీయ నాయకులు తెలుసని, మీ అందర్నీ సస్పెండ్ చేయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పోలీసులపై బాటిళ్లు విసిరేస్తూ వీరంగం సృష్టించారు.
ఈ మేరకు బంజారాహిల్స్ డిటెక్టవ్ ఇన్స్పెక్టర్ హఫీజుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులు అరిఫ్ మొయినుద్దీన్తోపాటు అతడి చెల్లెళ్లు జబీన్ (30), షబానా బేగం (25)లపై ఐపీసీ 332,353,504,596,109 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు అరిఫ్ మొయినుద్దీన్ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.