యాదాద్రి : అతివేగంతో ఓ వ్యక్తి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా, యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా ఢీకొట్టిన వ్యక్తి తీవ్ర గాయాలపాలలైన సంఘటన ఆలేరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై ఇద్రీస్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట గ్రామానికి చెందిన గొట్టిపర్తి బాలరాజుగౌడ్(32) తన పల్సర్ వాహనంపై పశువుల దాణా నిమిత్తం ఆలేరు వస్తూ పట్టణ శివారులోని మల్లికార్జున రైస్ మిల్ వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో యాదగిరిగుట్ట మండలంలోని కాచారం గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ మల్లయ్య తన ద్విచక్ర వాహనంపై అతివేగంగా, అజాగ్రత్తగా ఎదురుగా వస్తున్న పల్సర్ వాహనాన్ని ఢీకొట్టారు.
దీంతో గొట్టిపర్తి బాలరాజు తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా, మల్లయ్య గాయాలతో బయటపడ్డారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.