ఆ కుటుంబంలో తల్లీబిడ్డలు తప్ప మరెవరూ లేరు. 27 ఏళ్ల అశ్విన్ అనే ఆ యువకుడే ఇంట్లో సంపాదనాపరుడు. తల్లి అంటే అతనికి చాలా ప్రేమ. తల్లిని బాగా చూసుకోవాలని తపన పడేవాడు. అలాంటి యువకుడు.. ఆదివారం నాడు తల్లి కోసం ఒక హోటల్లో భోజనం పార్శిల్ కట్టించుకున్నాడు. అది తీసుకెళ్లడానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తున్నాడు.
వచ్చే దారిలో ఒక చోట స్ట్రీట్ లైటు కూడా లేదు. ఆ చీకటిలో రోడ్డుపై ఉన్న పెద్ద గుంత అతనికి కనిపించలేదు. చూసుకోక ఆ గుంతలోకి బైక్ పోనిచ్చాడు. దాంతో రోడ్డుపై పడిపోయిన అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం చూసిన కొందరు అంబులెన్సు సర్వీసుకు ఫోన్ చేసినా వాళ్లు సరిగా స్పందించలేదు. అలా దాదాపు అరగంటసేపు రక్తపు మడుగులో కొట్టుకుంటూనే ఉన్నాడా యువకుడు.
విషయం తెలిసిన అతని స్నేహితులు ఘటనా స్థలానికి వచ్చి.. అశ్విన్ను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రాత్రంతా ప్రాణాలతో పోరాడిన అశ్విన్ తెల్లవారకముందే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. కుమారుడు చనిపోయిన తర్వాత తను ఎవరి కోసం బతకాలంటూ అశ్విన్ తల్లి ఏడుస్తుంటే ఆపటం ఎవరి తరమూ కావడం లేదు.
ఈ ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రోడ్లు సరిచేయడం లేదని, అంబులెన్సు సేవల వాళ్లు సరిగా పనిచేయడం లేదని మండిపడుతున్నారు.