Rajanna Siricilla | తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడలో ఉరితాడు పెట్టుకొని మరీ వీడియో తీసి బలవన్మరణం పొందాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కమ్మరిపేట తండాలో విషాదం నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన భూక్య రాజు, జ్యోతి దంపతులకు ఒక కుమారుడు దినేష్ (17), కూతురు దీపిక ఉన్నారు. దంపతులు ఇద్దరు కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొడుకు, కూతురు పాఠశాలకు వెళ్లేవారు. కొంతకాలంగా దినేష్ స్కూల్ మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయాన్నే తండాలోని ఓ కిరాణ షాపునకు వెళ్లి దినేష్ సిగిరెట్ డబ్బా దొంగతనం చేశాడని కిరాణ షాపు యజమాని ఇంటికి వచ్చి గొడవకు దిగింది. దీంతో దినేష్ తల్లిదండ్రులు సిగిరెట్ ప్యాకెట్ డబ్బులు చెల్లిస్తామని గొడవ చేయవద్దని కిరాణ షాపు యజమానిని కోరారు. అయినా కూడా వినకుండా పంచాయతీ పెట్టి పరువు తీస్తానని గొడవ పెట్టింది. ఈక్రమంలో దినేష్ను తల్లిదండ్రులు మందలించడంతో పాటు పరువు తీస్తారనే భయంతో ఇంట్లో నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు.
వట్టిమల్ల గ్రామశివారులోని దుర్గమ్మ ఒర్రె దగ్గర గల గుట్టబోరుకు చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకగా రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తుపట్టి అక్కడికి వెళ్లి చూసే సరికి చెట్టుకు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి భూక్య రాజు ఫిర్యాదు మేరకు కిరాణ షాపు యజమానురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమాకాంత్ తెలిపారు.
దినేష్ మృతిచెందడానికి ముందు చెట్టుకు ఉరి పెట్టుకుని వీడియో రికార్డు చేసి తన స్నేహితుడికి వాట్సాప్లో పంపాడు. కానీ అతడు స్కూల్కు వెళ్లడంతో అతడి ఫోన్ ఇంటి వద్దే ఉండిపోయింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి వాట్సాప్ ఆన్ చేయగానే వీడియో చూసి కుటుంబ సభ్యులకు చెప్పాడు. వెంటనే దినేష్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ‘అమ్మ, నాన్న, చెల్లి బాయ్ ఇక నేను పోతున్న. చెల్లెకు పెళ్లి చేసే రోజు నా ఫొటో అక్కడ పెట్టి పెళ్లి చేయండి. ఇక నేను పోతున్న అందరికీ బాయ్’ అని ఏడుస్తూ తీసిన వీడియో అది వాట్సాప్లో వైరల్ అయింది. వీడియో చూస్తూ కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటగా, తండావాసులు సైతం కంటతడిపెట్టారు.