నిజాంసాగర్ : పంట పొలానికి నీళ్లు పారించేందుకు వెళ్లిన మహిళా రైతు ఒకరు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. నిజాంసాగర్ మండలంలోని మహ్మద్నగర్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేవల్ల భూదవ్వ(48)కు గ్రామ శివారులోని గట్టు మోరి శివారులో వ్యవసాయ భూమి ఉంది. రోజు మాదిరిగానే శనివారం ఉదయం ఆరు గంటలకు పొలానికి వెళ్లింది. పంటకు నీరు అందించేందుకు మోటరు స్టాటర్ బటన్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది.
ఉదయం పది గంటల వరకు కూడా భూదవ్వ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు అనుమానం చెంది పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా ఆమె మృతి చెంది ఉందని కుటుంబీకులు తెలిపారు. ఈ విషయాన్ని నిజాంసాగర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై సయ్యద్ అహ్మద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.