Warangal | వరంగల్ : విద్యుత్ షాక్ తగిలిన కోడలిని కాపాడబోయి అత్త మృతి చెందిన సంఘటన గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ గరీబ్నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగింది.
పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బైరోజు ఇంద్రజ వరంగల్లోని బట్టల షాపులో పనిచేస్తుంది. ఆమె భర్త పరిపూర్ణాచారి వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. షాపు నుంచి ఇంటికి వచ్చిన ఇంద్రజ భోజనం చేసిన అనంతరం, రాత్రి 10 గంటల సమయంలో బట్టలు ఉతికి ఇంటి ముందున్న రేకుల షెడ్డు కింద ఉన్న జే వైర్పై ఆరేసేందుకు యత్నించింది. దీంతో ఆమె విద్యుత్ షాక్కు గురై కేకలు వేసింది.
ఆ సమయంలో పక్కనే ఉన్న అత్త బైరోజు యాకలక్ష్మి(58) కోడలిని తన చేత్తో లాగింది. దీంతో ఇద్దరు విద్యుత్ షాక్కు గురై కింద పడ్డారు. ఇంద్రజ చేతి వేళ్లకు గాయం కాగా, యాకలక్ష్మి స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వారిని 108లో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో యాకలక్ష్మి మృతిచెందింది. పరిపూర్ణాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రాజు తెలిపారు.