హైదరాబాద్ : మల్కాజ్గిరి పోలీసు స్టేషన్ పరిధిలోని విమలాదేవి నగర్లో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మహిళ నివాసముంటున్న అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని, ఆ ఇంటి తలుపులు పగులగొట్టారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి పోలీసులు, స్థానికులు షాక్ అయ్యారు. మృతురాలిని విజయగా గుర్తించారు.
తల్లి మృతదేహం వద్దే ఆమె కుమారుడు రామకృష్ణ మూడు రోజులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే రామకృష్ణ మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు పేర్కొన్నారు. తల్లీకుమారుడికి మధ్య తరుచూ ఘర్షణ జరుగుతూ ఉండేదని స్థానికులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం విజయ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. విజయ ఆత్మహత్య చేసుకున్నదా? లేక కుమారుడు హత్య చేసి ఉంటాడా? అన్న విషయం తేలాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.