అమరావతి: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సీకే దిన్నె మండలం మద్దిమడుగులో అదుపుతప్పిన వ్యాను రోడ్డు పక్కన ఆరుబయట మంచంపై కూర్చున నలుగురిపై దూసుకెళ్లింది. దీంతో నలుగురు మృతి చెందారు. కడప, బెంగళూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రామంలో కడప నుంచి రాయచోటికి వెళ్తున్న జిప్సీ వ్యాన్ అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది .
ఈ ప్రమాదంలో కొండయ్య, లక్ష్మీదేవి అనే ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు అమ్ములు, దేవిని కడపలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరు కూడా మార్గమధ్యలోనే మృతి చెందారని పోలీసులు తెలిపారు. కొండయ్య, అమ్ములు భార్యభర్తలు కాగా లక్ష్మీదేవి, దేవి పక్కనే ఉండే కుటుంబ సభ్యులని వెల్లడించారు. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు జిప్సీ డ్రైవర్ను పట్టుకుని చితకబాదారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను తెలుసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసుస్టేషన్కు తరలించి విచారణ జరుపుతున్నారు.