కొడకండ్ల మే 6: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్పై అపోహలు వద్దని తప్పని సరిగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. విసృతంగా జ్వర సర్వే నిర్వహించి, కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా రోగులతో ఫోన్లో మాట్లాడి వారికి మానసిక ధైర్యం కల్పిస్తున్నారని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి కరోనా కట్టడిలో పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కుందూరు అమరేందర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ దూలం సతీశ్, డాక్టర్ రమేశ్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
జనగామ రూరల్ : కొవిడ్ నియంత్రణలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ అంబాల ఆంజనేయులు గౌడ్ సూ చించారు. గురువారం మండలంలోని పెంబర్తి గ్రామంలో పాలకవర్గ సమావేశం నిర్వహించి కరోనాపై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్నందున గ్రామంలోని దుకాణాలను మధ్యాహ్నం 2 గంటల వరకే తెరిచి ఉంచాలన్నారు. గ్రామాన్ని సంపూర్ణ ఆరోగ్య గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అంబాల రవి, పంచాయతీ కార్యదర్శి ప్రపూల్రెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.