బీజింగ్ : ఆన్లైన్ గేమ్స్కు చిన్నారులు ఎంతలా బానిసలయ్యారంటే చైనాలో 13 ఏండ్ల బాలిక నాలుగు నెలల్లో కుటుంబ సేవింగ్స్ అన్నింటినీ తుడిచిపెట్టేస్తూ మొబైల్ గేమ్స్పై (Mobile Games) డబ్బు తగలేసింది. ఈ కాలంలో బాలిక తన తల్లి ఖాతాలో కేవలం రూ. 5 మిగిల్చి ఏకంగా 4.49 లక్షల యువాన్ల (రూ. 52 లక్షలు)ను ఖర్చు చేసింది. గేమ్ను మెరుగ్గా ఆడేందుకు పెయిడ్ టూల్స్ను వాడాలని చాలా గేమ్స్ యూజర్లను ప్రోత్సహిస్తుంటాయి.
స్కూల్లో అధిక సమయం మొబైల్పై బాలిక గడుపుతుండటం టీచర్ గమనించడంతో ఈ విషయం బయటపడింది. పే టూ ప్లే గేమ్స్కు బాలిక బానిసైందని గుర్తించిన టీచర్ బాలిక తల్లిని అప్రమత్తం చేసింది. బాలిక తల్లి వాంగ్ తన బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోగా అందులో కేవలం 0.5 యువాన్ (రూ. 5) ఉన్నట్టు తేలడంతో కంగుతింది. బ్యాంక్ స్టేట్మెంట్లను చూసి వాంగ్ కన్నీరుమున్నీరైంది. మొబైల్ గేమ్స్కు చేసిన పలు చెల్లింపులు స్టేట్మెంట్లో నమోదయ్యాయి.
తన క్లాస్మేట్స్ గేమ్స్కు కూడా తాను చెల్లించానని బాలిక చెప్పుకొచ్చింది. డబ్బు గురించి తనకేమీ తెలియదని, అది ఎలా వస్తుందో కూడా అవగాహన లేదని బాలిక తెలిపింది. ఇంటిలో డెబిట్ కార్డు కనిపించడంతో దాన్ని తన స్మార్ట్ఫోన్కు కనెక్ట్ చేసుకున్నానని, దాని పాస్వర్డ్ను తల్లి తనకు చెప్పిందని బాలిక చెప్పడం గమనార్హం. తల్లికి అనుమానం రాకుండా తన స్మార్ట్ఫోన్లో మొబైల్ గేమ్స్ లావాదేవీలకు సంబంధించిన రికార్డులన్నింటినీ డిలీట్ చేశానని బాలిక తెలిపింది.
Read More