బెంగళూరు : కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కమలాపురలో వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు.. మినీ లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కలబురిగిలోని 3 ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదానికి గురైన బస్సును ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సుగా గుర్తించినట్లు కలబురిగి ఎస్పీ ఇషా పంత్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఏడు నుంచి 8 మంది మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో మాత్రం మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఉదయం 6:30 గంటలకు బీదర్ – శ్రీరంగపట్నం హైవేపై కమలాపుర సమీపంలో ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి గురైన బస్సు గోవా నుంచి హైదరాబాద్కు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా హైదరాబాద్కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు. బర్త్ డే పార్టీ కోసం హైదరాబాద్కు చెందిన రెండు కుటుంబాలు మే 29న గోవా వెళ్లినట్లు సమాచారం. ఒక కుటుంబంలో 11 మంది, మరో కుటుంబంలో 21 మంది వెళ్లారు. డ్రైవర్తో పాటు ఇద్దరు క్లీనర్లు ఉన్నారు.
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో గోవా నుంచి హైదరాబాద్కు వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 8 మంది సజీవదహనం అయ్యారు. pic.twitter.com/qeZYdmT4ec
— Namasthe Telangana (@ntdailyonline) June 3, 2022