కరీంనగర్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు మరింత అప్రమత్తమైంది. ఓవైపు నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తృతం చేస్తూనే, వైరస్ కట్టడికి పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. తాజాగా రాత్రి కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. ప్రతి రోజూ రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఈ నెల 30 వరకు అమలు చేసేందుకు, 87 ఉత్తర్వును జారీ చేసింది. అయితే ఫస్ట్ వేవ్ చివరి దశలో ఇచ్చిన విధంగా కొన్ని సడలింపులు ఇచ్చింది. కర్ఫ్యూ నిబంధనల మేరకు మంగళవారం రాత్రి నుంచే పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో పోలీసులు గస్తీ నిర్వహించారు. రాత్రి నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్ర భుత్వం మధ్యాహ్నం ప్రకటించగా, చాలాచోట్ల 8గంటల వరకే ఇండ్లకు చేరుకున్నారు. కరీంనగర్తోపాటు పలుచోట్ల తొమ్మిది గంటల తర్వాత రోడ్లపై జనాలు కనిపించడంతో పోలీసులు కౌన్సెలింగ్ చేసి పంపించారు. రాత్రి తొమ్మిది గంటల తర్వాత ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావద్దని స్పష్టం చేశారు.
ఉల్లంఘిస్తే చర్యలే..
వేసవి కావడంతో మధ్యాహ్న సమయంలో రోడ్లపై జనం అంతగా తిరగడం లేదు. రాత్రి వేళలో ఎక్కడబడితే అక్కడ జన సంచారం ఉంటున్నది. ముఖ్యంగా యువకులు ఎక్కువగా మాస్కులు లేకుండా తిరుగడం కనిపిస్తున్నది. ఇటు రెస్టారెంట్లు, హోటళ్లు, బార్లు రాత్రి వేళ ఎక్కువగా తెరిచే ఉంటున్నాయి. దుకాణాలు, మార్కెట్లు కూడా రాత్రి వరకు ఉంటున్నాయి. రాత్రి వేళ కర్ఫ్యూ విధించడం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చనే అభిప్రాయం ప్రభుత్వంలో కనిపిస్తుండగా, సర్కారు ఉత్తర్వులతో అధికారులు సాయంత్రం వరకే రంగంలోకి దిగారు. రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నా, 8 గంటలకే అన్ని రకాల దుకాణాలు, సంస్థలను మూసి వేయించే ప్రయత్నం చేశారు. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించనున్నారు. సెక్షన్ 51 కింద విచారణ జరిపి, విపత్తుల నిర్వహణ చట్టం-2005 ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు ప్రత్యేకంగా కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు. రాత్రి వేళలో ఎవరూ బయటికి రావద్దని, అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.