నల్లగొండ : నాంపల్లి మండలం కేతేపల్లిలో శనివారం నిర్వహించిన శ్రీరామ రథోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. రథం పైభాగానికి విద్యుత్ తీగలు తాకడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో రథంపై ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. మృతులను రాజబోయిన యాదయ్య, పొగాకు మోహనయ్య, దాసరి ఆంజనేయులుగా గుర్తించారు. కన్నుల పండువగా సాగుతున్న వేడుకలో ఈ అపశృతి చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.