Alive Died | చత్తీస్గఢ్లో విషాదం చోటు చేసుకున్నది. అగ్నిప్రమాదానికి గురైన ఓ కారులో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ఓ బాలిక ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన బిలాస్పూర్ జిల్లాలోని రతన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రతన్పూర్-పాండ్రో రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారులో భారీ మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. మంటలు ఉద్ధృతంగా ఉండటంతో కారులో ప్రయాణిస్తున్న వారికి ప్రాణాలను కాపాడుకునే అవకాశం లభించలేనట్లుగా తెలుస్తున్నది. కారులో నుంచి ముగ్గురి అస్థిపంజరాలను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ఒక బాలిక ఉండగా.. మృతుల్లో ఒకరిని షానవాజ్ ఖాన్ అనే జర్నలిస్టుగా గుర్తించారు. మరో మృతుడి పేరు అభిషేక్ కుర్రేగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక ఆచూకీ తెలియరాలేదు. ముగ్గురూ బిలాస్పూర్ నుంచి రతన్పూర్ వైపు వెళ్తున్నట్లుగా తెలుస్తున్నది.
మంటలను చూసిన కొందరు వారిని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమైనట్లుగా స్థానికులు చెప్తున్నారు. అగ్నికి ఆహులైన కారు నంబర్ సీజీ 10 బీడీ 7861. మృతుడు షానవాజ్ పేరుతో కారు రిజిస్టర్ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. బిలాస్పూర్ నుంచి ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని పిలిచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించినట్లు ఎస్డీఓపీ కోట ఆశిష్ అరోరా చెప్పారు. కారులో ఎంత మంది ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారో ఇప్పుడే చెప్పలేమన్నారు.