అహ్మదాబాద్ : గుజరాత్లోని కండ్లా పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. కచ్ జిల్లాలోని కండ్లా పోర్ట్ నుంచి గుజరాత్ ఏటీఎస్, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 260 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ 1300 కోట్లు ఉంటుందని అంచనా. డ్రగ్స్ను కంటెయినర్లలో భారత్కు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో అప్రమత్తమైన గుజరాత్ ఏటీఎస్ డీఆర్ఐ అధికారులతో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ను చేపట్టింది.
కంటెయినర్ నుంచి పెద్దమొత్తంలో డ్రగ్స్ను అధికారులు సీజ్ చేశారు. కాగా అసోంలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టును గువహటి పోలీసులు ఇటీవల రట్టు చేశారు. డ్రగ్స్ రాకెట్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు రూ 7.5 కోట్ల విలువైన 750 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. గువహటిలోని గర్చుక్ ప్రాంతంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి భారీ మొత్తంలో డ్రగ్స్ను సీజ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాదారులపై ఉక్కుపాదం మోపి దాడులు తీవ్రతరం చేశామని పోలీసులు తెలిపారు. మరో ఘటనలో మణిపూర్కు చెందిన డ్రగ్స్ సరఫరాదారును అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సుల్లో 260 గ్రాముల హెరాయిన్ను తరలిస్తూ నిందితుడు పట్టుబడ్డాడు. మణిపూర్ నుంచి వస్తున్న బస్ను ఆపి పోలీసులు తనిఖీ చేయడంతో డ్రగ్స్ దందా బట్టబయలైంది. అసోంలోని కర్బి అంగ్లాంగ్ జిల్లాలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.