మేడ్చల్ మల్కాజ్గిరి : శామీర్పేట మండలం తుర్కపల్లి వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రాజీవ్ రహదారిపై వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను జగిత్యాల జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.