హైదరాబాద్ : ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ పసిబిడ్డపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన సనత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జింకలవాడ బస్తీలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. జింకలవాడ ఆంజనేయ ఆలయం సమీపంలో పొట్టేలు అఖిల్ తన భార్య, కూతురు మోక్షిక(14 నెలలు)తో కలిసి ఉంటున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం మోక్షిక ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. అదుపుతప్పిన కారు చిన్నారిపై నుంచి దూసుకెళ్లింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన మోక్షికను చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారు(ఏపీ 13 పీ 5726)ను గుర్తించారు. ప్రమాదానికి కారకుడైన మహ్మద్ రసూల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే డ్రైవింగ్ చేసిన రసూల్కు లైసెన్సు, కారుకు ఇన్సూరెన్స్ లేవని తెలుస్తోంది.