జయశంకర్ భూపాలపల్లి : చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన గాజే రామ్ చరణ్ (12) రెండు రోజుల క్రితం ఇంట్లో నుండి వెళ్లి పోయాడు. బాలుడు అదృశ్యంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కుమారుడి ఆచూకీ కోసం గ్రామ శివార్లలో వెతికారు. గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద చరణ్ చెప్పులు సోమవారం కనిపించాయి.
దీంతో పోలీసులు, సర్పంచ్ పుట్టపాక మహేందర్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు బావినంతా గాలించారు. మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. కాగా మంగళవారం ఉదయం బాలుడి మృతదేహం వ్యవసాయ బావిలో తేలింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. చరణ్ తల్లిదండ్రులకు తెలిపారు. మృతదేహం వద్ద మృతుడి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.