ముంబై : ఆన్లైన్లో రూ 1220 విలువైన మద్యం ఆర్డర్ ఇచ్చిన వృద్ధుడు (62) రూ 3.45 లక్షలు మోసపోయిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. మద్యం షాపులో పనిచేసే వ్యక్తిగా బాధితుడిని బోల్తా కొట్టించిన నిందితుడు అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వాలని అడిగాడు. నవంబర్ 3న బాధితుడు దహిసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకువచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వృద్ధుడు పెన్షన్పై ఆధారపడి జీవిస్తున్నాడు.
ఆన్లైన్లో మద్యం విక్రయించే దుకాణాల గురించి గూగుల్లో సెర్చి చేస్తూ లివింగ్ లిక్విడ్జ్ అనే దుకాణానికి ఆర్డర్ ఇచ్చేందుకు ఆయన కాల్ చేశాడు. ఈ నెంబర్పై కాల్ రిసీవ్ చేసుకున్న నిందితుడు అడ్వాన్స్ పేమెంట్, రిజిస్ట్రేషన్ అమౌంట్ తర్వాత రిఫండ్ చేస్తామంటూ ఇలా మొత్తం రూ 3.45 లక్షలు బాధితుడి నుంచి కాజేశాడు. తాను చెల్లించిన మొత్తం రిఫండ్ చేయాలని వృద్ధుడు కోరగా 24 గంటల్లో రిఫండ్ చేస్తామని చెప్పినా డబ్బు వెనక్కిరాకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.