హైదరాబాద్ : తెలుగు సాహిత్యంలో తొలి యోగిక కావ్యంగా గుర్తింపు పొందిన విశ్వర్షి వాసిలి “నేను”పై శనివారం నుంచి 12 రోజులు అంతర్జాలం వేదికగా సదస్సులు జరుగనున్నాయి. వివిధ పత్రికల కాలమ్స్, వ్యక్తిత్వ, ఆధ్యాత్మిక, యోగ, తాత్త్విక గ్రంథాల ద్వారా పేరొందిన యోగ గురువు విశ్వర్షి వాసిలి 65వ జన్మదినాన్ని పురస్కరించుకుని యోగాలయ రీసెర్చ్ సెంటర్ నిర్వహిస్తున్న “తెలుగు సాహిత్య పీఠంపై విశ్వర్షి ‘నేను'” వెబినార్ ప్రతీరోజూ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ సదస్సులలో కథకులు జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి, స్వరకర్త వనపర్తి సత్యనారాయణ, స్ట్రక్చరల్ ఇంజినీర్ గొల్లపల్లి శ్రీకృష్ణ, బ్లూ స్కై సైంటిస్ట్ డా. పారనంది అరవిందరావు (ఇంగ్లాండ్), అడ్వకేట్ అరుణాభాస్కర్ దేవ్, హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఆచార్యులు డా. జి. అరుణ కుమారి, ప్రముఖ జానపద పరిశోధకులు డా. జి.ఎస్. మోహన్, పాత్రికేయులు భగీరథ, విమర్శకులు డా. వూసల రజనీగంగాధర్, కవి డాక్టర్. నాళేశ్వరం శంకరం, అంతర్జాతీయ కవి రోచిష్మాన్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉయ్యూరు శ్రీలత తమ విశ్లేషణాత్మక, పరిశోధక, తాత్విక పత్రాలతో ప్రసంగిస్తారు.