Vijay Deverakonda | టాలీవుడ్ స్టార్ నటులు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన తాజా చిత్రం ఖుషి (Kushi). రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్ఫుల్ టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. ఐదేళ్ల తర్వాత విజయ్ దేవరకొండకు మళ్లీ సూపర్ హిట్ పడ్డట్టు ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ చెబుతున్నాయి. లైగర్ డిజాస్టర్ తర్వాత మంచి సక్సెస్ అందుకోవడంతో విజయ్ దేవరకొండ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో విజయ్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. ఖుషి చిత్రం ద్వారా తాను సంపాదించిన (Kushi salary) మొత్తంలో రూ.కోటిని వంద కుటుంబాలకు ( 100 families) ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన ఖుషి ప్రొమోషనల్ ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ.. ‘ఖుషి చిత్రం ఇవాళ ఫేక్ రివ్యూలను, తప్పుడు ప్రచారాలను అధిగమించి విజయవంతంగా ప్రదర్శితమవుతోందంటే అందుకు కారణం అభిమానులే. కొందరు డబ్బులిచ్చి మరీ ఖుషి చిత్రంపై వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారు. కానీ, అభిమానుల ప్రేమ ముందు అవేవీ పనిచేయలేదు. అభిమానుల ముఖాల్లో ఆనందం చూడాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో పంచుకోవాలని ఉంది కానీ, అది సాధ్యం పడదు. డబ్బు సంపాదించాలి, అమ్మ, నాన్నలను హ్యాపీగా ఉంచాలి. సమాజంలో గౌరవం కావాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే నేనెప్పుడూ పనిచేస్తుంటాను. కానీ, ఇప్పటి నుంచి మీ ( ఫ్యాన్స్) అందరి కోసం పనిచేయాలనుకుంటున్నాను. మీరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనమంతా ఓ ఫ్యామిలీ. అందుకే నా విజయం, సంతోషంతోపాటు నా సంపాదనను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఖుషి చిత్రం ద్వారా నేను సంపాదించిన మొత్తంలో ఒక రూ.కోటిని వంద కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఓ వంద కుటుంబాలను ఎంపిక చేసి వారికి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కును వారం పదిరోజుల్లో అందజేస్తాను’ అని విజయ్ దేవరకొండ వెల్లడించారు.
ఖుషి చిత్రానికి శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్1న గ్రాండ్గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోవడంతో సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాడు విజయ్ దేవరకొండ.
Also Read..
G20 Summit | ఆ మూడు రోజులు ఢిల్లీలో స్విగ్గీ, జొమాటో, అమెజాన్ సహా పలు ఆన్లైన్ డెలివరీ సేవలు బంద్
Raghumar Reddy | వర్షాల వేళ ప్రజలు ఇండ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి: ట్రాన్స్కో సీఎండీ రఘుమా రెడ్డి
Sriram Sagar | పూర్తిగా నిండిన శ్రీరాం సాగర్ ప్రాజెక్టు.. 16 గేట్లు ఎత్తివేత