Vignesh Shivan | కోలీవుడ్ స్టార్ జంట నయనతార (Nayanthara) – విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) దంపతులు మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. విఘ్నేశ్ కుటుంబానికి సంబంధించిన ఉమ్మడి ఆస్తి విషయంలో తాజాగా ఈ జంటపై కేసు నమోదైనట్లు సమాచారం.
కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం మేరకు.. విఘ్నేశ్ శివన్ తండ్రి శివ కొళుదు (Sivakolundhu) వాళ్లు తొమ్మిది మంది అన్నదమ్ములు. వీరిది తిరుచ్చి జిల్లా లాల్ గుడి (Lalagudi) గ్రామం. పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేసిన విఘ్నేశ్ తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన బతికున్నప్పుడు తమ ఉమ్మడి ఆస్తిని (Property) అన్నదమ్ములకు తెలియకుండా మోసపూరితంగా ఇతరులకు అమ్ముకున్నాడంటూ ఆయన సోదరులు మాణిక్యం (Manickam), కుంజిత పాదం (Kunjithapadham)ఆరోపించారు. ఈ మేరకు విఘ్నేశ్ దంపతులు సహా ఆయన కుటుంబ సభ్యులపై తిరుచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఆస్తిని కొనుగోలు చేసిన వారి నుంచి తమ ఆస్తిని తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని మాణిక్యం, కుంజిత పాదం డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ సోదరుడి కుమారుడు విఘ్నేశ్ శివన్, అతని తల్లి మీనాకుమారి, సోదరి ఐశ్వర్య, భార్య నయనతారపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. విఘ్నేశ్ బాబాయ్ లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయాల్సిందిగా తిరుచ్చి డీఎస్పీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన తమిళ చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ కపుల్స్లో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) జంట ఒకటి. సుమారు ఏడేండ్లపాటు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో గతేడాది జూన్లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే, పెళ్లైన నాటి నుంచీ ఈ జంట ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. వివాహం అనంతరం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ఈ జంట అక్కడ దర్శనానంతరం తిరుమల మాడవీధుల్లో చెప్పులతో సంచరించడంపై హిందూ వర్గాలు, భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పి వివాదం నుంచి బయటపడ్డారు.
ఆ తర్వాత పెళ్లైన నాలుగు నెలలకే కవలలకు తల్లిదండ్రులైనట్లు ప్రకటించి మరో వివాదంలో పడ్డారు. ఈ జంట సరోగసి నిబంధనలు ఉల్లంఘించిందంటూ తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే తమకు ఐదేళ్ల క్రితమే పెళ్లైందంటూ అప్పట్లో ఈ జంట బాంబు పేల్చింది. సరోగసి చట్టంలోని అన్ని నిబంధనలూ పాటించామంటూ అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించింది. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఈ క్రమంలో ఉమ్మడి ఆస్తి వివాదం ఈ జంటకు తలనొప్పిగా మారింది.
Also Read..
Puffed Rice | పేలాలను చిన్నచూపు చూస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలిస్తే రోజూ అవే కావాలంటారు!!
Rahul Gandhi | పొలంలోకి దిగి.. ట్రాక్టర్తో దుక్కి దున్నిన రాహుల్ గాంధీ
Tomato Price | రూ.250కు చేరిన టమాట ధర.. కర్ణాటకలో సీసీ కెమెరా నిఘాలో అమ్మకాలు