న్యూఢిల్లీ, జూలై 7: దేశంలో ఇప్పుడు టమాట ఖరీదైన వస్తువుల జాబితాలో చేరింది. ఎక్కడ చూసినా కొండెక్కిన దీని ధర గురించే చర్చే. టమాట ధర శుక్రవారం డబుల్ సెంచరీని కూడా దాటింది. టమాటాల ధరాఘాతం ఇప్పుడు ప్రజలనే కాదు వ్యాపార సంస్థలను కూడా తాకింది. దీంతో చాలా రెస్టారెంట్లు, బేకరీలు ఆహార పదార్థాలలో టమాటాను వాడటం లేదంటూ ప్రకటించాయి. తాజాగా మెక్డొనాల్డ్స్ తమ ఔట్లెట్లలో తయారు చేసే ఆహార పదార్థాలలో టమాట వినియోగాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆయా ఔట్లెట్ల ముందు నోటీసులు పెట్టింది. నాణ్యమైన టమాటాలు దొరకడం లేదని సంస్థ చెప్పింది. దీంతో ఇక ముందు టమాట లేకుండానే పిజ్జాలు, బర్గర్లు తినాలంటూ ఆహార ప్రియులు నిట్టూరుస్తున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో యూజర్లు టమాట లేకుండా ఉన్న పిజ్జాలు, బర్గర్ల ఫొటోలను షేర్ చేస్తున్నారు.
దేశంలో టమాట ధర రికార్డు స్థాయికి చేరింది. ఉత్తరాఖండ్లోని గంగోత్రి ధామ్లో శుక్రవారం కేజీ టమాట రూ.250కు చేరింది. కిలో 200 నుంచి 250 వరకు ధర పలికినట్టు స్థానిక వ్యాపారులు తెలిపారు. అయితే ఇంతమొత్తం వెచ్చించి కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదన్నారు. శుక్రవారం చెన్నైలో కిలో 100-130, బెంగళూరులో 101-121 రూపాయల ధర పలికింది. కాగా, కర్ణాటకలో 2.50 లక్షల విలువైన టమాటాలు చోరీ కావడంతో వ్యాపారులు, రైతులు అప్రమత్తమయ్యారు. హవేరిలోని అక్కి అలూరుకు చెందిన ముత్తప్ప అనే టమాట రైతు తన పొలం నుంచి తెచ్చిన టమాటాలు చోరీ కాకుండా వాటిని అమ్మే ప్రదేశంలో సీసీ కెమెరాను కూడా అమర్చాడు. ఇప్పుడు టమాటా అంటే బంగారంతో సమానమని, అందుకే ముందు జాగ్రత్తగా బ్యాటరీతో నడిచే సీసీ కెమెరాను ఏర్పాటు చేసినట్టు తెలిపాడు.