‘టికెట్ల రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ కొత్త జీవో 120ని జారీచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రులు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్యాదవ్తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఈ జీవోను డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు దుర్వినియోగం చేయకుండా సరిగ్గా వాడుకున్నప్పుడే న్యాయం జరుగుతుంది’ అని అన్నారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్నారంగ్. శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సునీల్నారంగ్ మాట్లాడుతూ ‘జీవో 120 ప్రకారం చిన్న సినిమాకు కనిష్టంగా 50, గరిష్టంగా 150 వరకు టికెట్ల ధరలను నిర్ణయించడం జరిగింది. ఆ ధరల లోపు టికెట్లను అమ్మాలి. శుక్రవారం విడుదలైన చిన్న సినిమాల టికెట్లను ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లుగా కైంప్లెట్స్ వచ్చాయి. రేట్లను తగ్గించమని థియేటర్ వారికి విన్నవించాం. శనివారం నుంచి జీవో 120ని అతిక్రమించకుండా చూస్తాం. లాక్డౌన్ కారణంగా ఎగ్జిబిటర్లు చాలా నష్టపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్ల నిర్వహణ వ్యయాలు పెరిగాయి. ప్రభుత్వ సహాయంతో నష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గరిష్టంగా సింగిల్స్క్రీన్లో 175, మల్టీప్లెక్స్లో 295గా ధరలను నిర్ణయించాం’ అని తెలిపారు. సెక్రటరీ అనుపమ్రెడ్డి మాట్లాడుతూ ‘చిన్న సినిమాల నుంచి పెద్ద చిత్రాల వరకు అందరికి న్యాయం జరగాలనే ప్రభుత్వం జీవో 120ని జారీచేసింది. ఈ జీవో ప్రకారం చిన్న సినిమా టికెట్లను మొదటి రోజు నుంచి కనిష్టధరలకే అమ్మాలి’ అన్నారు.