Varalaxmi Sarathkumar | ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్కుమార్కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కేరళ విభాగం అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఇటీవల కేరళలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం ఆమెకు సమన్లు పంపినట్లు తెలుస్తున్నది. ఈ కేసులో వరలక్ష్మి మాజీ ఏపీ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉండగా.. అతనికి సంబంధించిన వివరాలను సేకరించేందుకు విచారణకు రావాలని పిలిచినట్లు సమాచారం. ఎన్ఐఏ అధికారులు ఆగస్టు 18న కేరళలోని విళంజియం సమీపంలో ఓ ఫిషింగ్ బోట్ నుంచి రూ.2,100కోట్ల విలువైన 300 కిలోల హెరాయిన్తో పాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత వరలక్ష్మి మాజీ అసిస్టెంట్ సహా పలువురి ఏజెన్సీ వివిధ కేసుల కింద కేసులను నమోదు చేసింది. ఈ కేసులో ఆదిలింగంను ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తుండగా.. డ్రగ్స్ సరఫరాతో వచ్చిన డబ్బులను అతడు సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్లుగా జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఈ కేసులో వరలక్ష్మికి ఏమైనా సంబంధం ఉందా? గతంలో ఈమెకు ఆదిలింగం డ్రగ్స్ సరఫరా చేశాడా? అనే వివరాలను కూడా ఎన్ఐఏ రాబట్టే అవకాశం ఉందని సమాచారం. వరలక్ష్మి శరత్ కుమార్కు ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడంతో తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించింది. అయితే, నోటీసులపై నటి వరలక్ష్మి ఇంకా స్పందించలేదు.